QuoteInaugurates Pune Metro section of District Court to Swargate
QuoteDedicates to nation Bidkin Industrial Area
QuoteInaugurates Solapur Airport
QuoteLays foundation stone for Memorial for Krantijyoti Savitribai Phule’s First Girls’ School at Bhidewada
Quote“Launch of various projects in Maharashtra will give boost to urban development and significantly add to ‘Ease of Living’ for people”
Quote“We are moving at a fast pace in the direction of our dream of increasing Ease of Living in Pune city”
Quote“Work of upgrading the airport has been completed to provide direct air-connectivity to Solapur”
Quote“India should be modern, India should be modernized but it should be based on our fundamental values”
Quote“Great personalities like Savitribai Phule opened the doors of education that were closed for daughters”

నమస్కారం!

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్, శ్రీ అజిత్ పవార్, పుణే పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడు, మంత్రివర్గ యువ సహచరుడు శ్రీ మురళీధర్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొంటున్న ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ కార్యక్రమానికి హాజరైన సోదర సోదరీమణులందరికీ..

అలాగే ప్రియమైన పుణే సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు!

ప్రధాన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన నిమిత్తం రెండు రోజుల కిందటే పుణేకు రావాల్సి ఉంది. కానీ భారీ వర్షాల కారణంగా ఆ కార్యక్రమం రద్దయింది. ఇది నాకు వ్యక్తిగతమైన నష్టం. ఎందుకంటే పుణేలో అణువణువూ దేశభక్తితో నిండి ఉంటుంది. ఈ నగరంలోని ప్రతిభాగం సామాజిక స్పృహను కలిగి ఉంది. ఇలాంటి నగరాన్ని సందర్శించిన వారిలో శక్తి ప్రవేశిస్తుంది. ఈ రోజు కూడా ఈ నగరానికి నేను రాలేకపోయాను కాబట్టి ఇది నాకు నష్టమే. అయినా మిమ్మల్నందరినీ ఇలా కలుసుకునే అవకాశం ఇచ్చిన టెక్నాలజీకి ధన్యవాదాలు. భారత మహనీయుల్లో స్ఫూర్తి నింపిన ఈ పుణే భూమి, మహారాష్ట్రలో సరికొత్త అధ్యాయానికి సాక్ష్యంగా నిలుస్తోంది. జిల్లా కోర్టు నుండి స్వర్గేట్ సెక్షన్ వరకు మెట్రో మార్గం ఇప్పుడే ప్రారంభమైంది. ఈ మార్గంలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. స్వర్గేట్-కత్రాజ్ సెక్షన్‌కు ఈ రోజే శంకుస్థాపన జరిగింది. వీటికి అదనంగా మన సమాజంలో గణనీయమైన మార్పులకు నాంది పలికిన సావిత్రీబాయి ఫూలే స్మారక నిర్మాణానికి ఈరోజు పునాది పడింది. ఈ నగరంలో ‘సులభతర జీవన విధానాన్ని’ పెంపొందించాలనే మా కలను సాకారం చేసే దిశలో వేగంగా మేం ప్రయాణిస్తున్నందుకు సంతోషిస్తున్నాను.

 

|

సోదర సోదరీమణులారా,

విఠల భగవానుని ఆశీస్సులతో ఆయన భక్తులకు అమూల్యమైన బహుమతి ఈ రోజు లభించింది. షోలాపూర్‌ను నేరుగా చేరుకునేలా విమానాశ్రయ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. టెర్మినల్ భవన సామర్థ్యాన్ని పెంచారు. అలాగే ప్రయాణికులకు నూతన సౌకర్యాలను అభివృద్ధి చేశారు. ఇది దేశవిదేశాల్లోని విఠల భక్తులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడు స్వామిని దర్శించుకోవడానికి నేరుగా షోలాపూర్ చేరుకోవచ్చు. ఇది వాణిజ్యం, వ్యాపారం, పర్యాటకం పెరిగేలా చేస్తుంది. ఈ అభివృద్ధి పనుల విషయమై మహారాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

స్నేహితులారా,

ప్రస్తుతం మహారాష్ట్రకు కొత్త లక్ష్యాలు, తీర్మానాలు అవసరం. అందుకే అభివృద్ధికి ఆస్కారం ఉన్న పుణే లాంటి నగరాలను సృష్టించాలి. పుణే ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా జనాభా కూడా పెరుగుతోంది. అభివృద్ధిపై జనాభా పెరుగుదల ప్రభావం చూపకుండా నగర సామర్థ్యాన్ని పెంచాలంటే దానికి తగిన చర్యలు ఇప్పుడే తీసుకోవాలి. పుణేలో ప్రజా రవాణా వ్యవస్థను ఆధునికీకరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నగరం విస్తరించినప్పుడు వివిధ ప్రాంతాల మధ్య రవాణా సదుపాయాలు సైతం మెరుగ్గా ఉంటాయి. ఈ విధానంతోనే మహాయుతి ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేస్తోంది.

 

|

స్నేహితురాలా,

పుణే నగర ఆధునిక అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే ఈపాటికే ఈ పని పూర్తయి ఉండాలి. మెట్రో లాంటి అధునాతన రవాణా వ్యవస్థను చాలా కాలం కిందటే ప్రవేశపెట్టి ఉండాల్సింది. దురదృష్టవశాత్తూ గడచిన దశాబ్దాల్లో పట్టణాభివృద్ధికి సరైన ప్రణాళిక, దార్శనికత లేవు. ఒకవేళ ప్రణాళికపై చర్చ జరిగినా అది ఏళ్ల తరబడి ఫైళ్లలోనే మగ్గిపోయేది. ప్రాజెక్టును ఆమోదిస్తే అది పూర్తవడానికి దశాబ్దాలు సమయం పట్టేది. ఈ విధమైన కాలం చెల్లిన పనితీరు వల్ల మనదేశం, మహారాష్ట్ర, పుణేలకు నష్టం జరిగింది. పుణేలో మెట్రో నిర్మించాలనే ప్రతిపాదన 2008లోనే వచ్చిందన్న విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అడ్డంకులు తొలగించి, వేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో 2016 నాటికి గానీ పునాదిరాయి పడలేదు. ప్రస్తుతం మెట్రో సజావుగా నడుస్తూ విస్తరణ దిశగా సాగుతోంది.

అభివృద్ధి చేసిన ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభించడంతో పాటు స్వర్గేట్-కాత్రాజ్ లైన్‌కు శంకుస్థాపన చేశాం. ఈ ఏడాది మార్చిలో రూబీ హాల్ క్లినిక్ నుంచి రామ్‌వాడి వరకు మెట్రోసర్వీసును నేను ప్రారంభించాను. 2016 నుంచి మొదలుపెడితే ఈ ఏడెనిమిది ఏళ్లలో నగర మెట్రో ఎంతో ప్రగతి సాధించింది. అనేక మార్గాలకు విస్తరణ దిశగా సాగుతోంది. పాత తరహా పనితీరుతో ఇది సాధ్యం కాదు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న ఎనిమిదేళ్లలో ఒక్క స్థంభాన్ని కూడా నిర్మించలేకపోయింది. మన ప్రభుత్వం మాత్రం పుణేలో ఆధునిక మెట్రో వ్యవస్థను నిర్మించింది.

 

|

స్నేహితులారా,

అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వం కొననసాగడం రాష్ట్ర ప్రగతికి అవసరం. ఈ విషయంలో ఏదైనా ఆటంకం ఏర్పడితే మహారాష్ట్ర తీవ్రంగా నష్టపోతుంది. మెట్రో ప్రాజెక్టులు, ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు, రైతుల కోసం చేపట్టిన ప్రధానమైన సాగు ప్రాజెక్టులను చూడండి. మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కారు రాక ముందు ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు గాడి తప్పాయి. దీనికి మరో ఉదాహరణ బిడ్కిన్ పారిశ్రామిక ప్రాంతం. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నా స్నేహితుడు దేవేంద్ర ‘ఆరిక్ సిటీ’ని ప్రతిపాదించారు. ఢిల్లీ-ముంబయి ఇండస్ట్రియల్ కారిడార్‌లోని షెండ్ర-బిడ్కిన్ పారిశ్రామిక ప్రాంత నిర్మాణానికి పునాది వేశారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా ఈ పనులు జరగాల్సి ఉంది. కానీ మధ్యలోనే పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు షిండే నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఈ అడ్డంకులన్నింటినీ తొలగించింది. బిడ్కిన్ పారిశ్రామిక ప్రాంతాన్ని ఈ రోజు జాతికి అంకితం చేశాం. ఇది ఛత్రపతి శంభాజీనగర్ లో ఎనిమిది వేల ఎకరాలకు పైగా విస్తరించనుంది. ఇప్పటికే అనేక భారీ పరిశ్రమలకు స్థలాలను కేటాయించారు. ఫలితంగా వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. వేలాది మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుంది. పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగాలను సృష్టించడమే మహారాష్ట్రలోని యువతను బలోపేతం చేసేందుకు పాటించాల్సిన మంత్రం.

వికసిత్ భారత్(అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యాన్ని సాధించడానికి ఎన్నో మైలురాళ్లను మనం దాటాల్సి ఉంటుంది. మన మూలాలు, విలువకు ప్రాధాన్యమిస్తూనే దేశాన్ని నవీకరించాలి. మన వారసత్వ సంపదను సగర్వంగా ముందుకు తీసుకెళుతూ దేశాన్ని అభివృద్ధి చేయాలి. దేశ అవసరాలు, ప్రాధాన్యాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను ఆధునికీకరించాలి. ఒకే లక్ష్యంతో మన సమాజం ముందుకు సాగాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మన ప్రయాణం కొనసాగించాలి.

 

|

మహారాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరువయ్యేలా చేయడం ఎంత ముఖ్యమో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను రూపకల్పన చేయడం కూడా అంతే ముఖ్యం. సమాజంలోని ప్రతి వర్గం దేశాభివృద్ధిలో పాలు పంచుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. వికసిత్ భారత్‌కు మహిళలు నాయకత్వం వహించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. సమాజంలో మార్పు తీసుకువచ్చే బాధ్యతను మహిళలు తీసుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. మహారాష్ట్ర గడ్డ దానికి సాక్ష్యం. మహిళల అక్ష్యరాస్యతకై ఈ నేల మీదే సావిత్రిబాయి ఫూలే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాల ఇక్కడే ప్రారంభమైంది. ఈ ఉద్యమ జ్ఞాపకాలు, వారసత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం. బాలికల కోసం తొలి పాఠశాల స్థాపించిన ఈ ప్రదేశంలోనే సావిత్రీబాయి ఫూలే స్మారకానికి ఈరోజు శంకుస్థాపన చేశాను. ఇందులో నైపుణ్యాభివృద్ధి కేంద్రం, గ్రంథాలయం, అవసరమైన ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఈ స్మారకం సామాజిక చైతన్య ఉద్యమ జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతుంది. అలాగే సమాజానికి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి కలిగిస్తుంది.

సోదర సోదరీమణులారా,

స్వాతంత్ర్యానికి పూర్వం మన సమాజంలో పేదరికం, వివక్ష ఎక్కువగా ఉండేవి. ఆరోజుల్లో విద్య బాలికలకు అందని ద్రాక్షలా ఉండేది. సావిత్రీబాయి ఫూలే లాంటి గొప్పవారు బాలికా విద్యకై కృషి చేశారు. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత కూడా మనదేశం పాత మనస్తత్వం నుంచి పూర్తిగా బయటపడలేదు. గత ప్రభుత్వాలు చాలా విభాగాల్లో మహిళలకు ప్రవేశాన్ని అడ్డుకున్నాయి. పాఠశాలల్లో మరుగుదొడ్ల లాంటి కనీస సౌకర్యాలు ఉండేవి కాదు. ఫలితంగా బడి ఉన్నప్పటికీ అమ్మాయిలకు మాత్రం దాని తలుపులు ఎప్పుడూ మూసే ఉండేవి. ఆడపిల్లలు కాస్త పెద్దయ్యేసరికి చదువు మానేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యేవి. సైనిక పాఠశాలల్లో బాలికల ప్రవేశంపై నిషేధం ఉండేది. అలాగే ఆర్మీలోని చాలా విభాగాల్లో మహిళలకు అనుమతి ఉండేది కాదు. అదేవిధంగా గర్భం దాల్చిన తర్వాత ఎంతో మంది మహిళలు ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చేది. గత ప్రభుత్వాలు అవలంభించిన ఈ తరహా పాత ధోరణిని మేము పూర్తిగా మార్చివేశాం. స్వచ్ఛభారత్ అభియాన్ (క్లీన్ ఇండియా) కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది దేశంలోని కుమార్తెలు, తల్లులకు  బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తి కల్పించి మేలు చేకూర్చింది. పాఠశాలల్లో టాయిలెట్లను నిర్మించడం వల్ల బాలికల్లో చదువు మానేసేవారి సంఖ్య తగ్గింది. ఆర్మీ, మిలటరీ పాఠశాలల్లో మహిళలకు అనేక అవకాశాలు కల్పించాం. మహిళల భద్రత కోసం కఠినచట్టాలు తీసుకొచ్చాం. వీటితో పాటుగా ప్రజాస్వామ్యంలో మహిళా భాగస్వామ్యం పెంచే హామీని నారీ శక్తి వందన్ అధీనియం ద్వారా ఇచ్చాం.

 

|

స్నేహితులారా,

మన ఆడపిల్లలకు అన్ని రంగాల్లోనూ అవకాశాలు ఎప్పుడు వస్తాయో అప్పుడే మన దేశ అభివృద్ధి తలుపులు తెరుచుకుంటాయి. మహిళాసాధికారత దిశగా మనం చేస్తున్న ప్రయత్నాలు, కార్యక్రమాలను సావిత్రీబాయి ఫూలే స్మారకం శక్తిమంతం చేస్తుందని నమ్ముతున్నాను.

స్నేహితులారా,

మహారాష్ట్ర ప్రాంతం అందించే ప్రేరణ ఎప్పటిలానే దేశానికి మార్గనిర్దేశం చేస్తుందని విశ్వసిస్తున్నాను. మనమంతా కలసి, ‘వికసిత్ మహారాష్ట్ర, వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన మహారాష్ట్ర, అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యాన్ని సాధిద్దాం. మరోసారి ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రారంభించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరికీ ధన్యవాదాలు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Indian startups raise $1.65 bn in February, median valuation at $83.2 mn

Media Coverage

Indian startups raise $1.65 bn in February, median valuation at $83.2 mn
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates H.E. Mr. Christian Stocker on being sworn in as the Federal Chancellor of Austria
March 04, 2025

The Prime Minister Shri Narendra Modi today congratulated H.E. Mr. Christian Stocker on being sworn in as the Federal Chancellor of Austria. He added that the India-Austria Enhanced Partnership was poised to make steady progress in the years to come.

Shri Modi in a post on X wrote:

"Warmly congratulate H.E. Christian Stocker on being sworn in as the Federal Chancellor of Austria. The India-Austria Enhanced Partnership is poised to make steady progress in the years to come. I look forward to working with you to take our mutually beneficial cooperation to unprecedented heights. @_CStocker"