


అధ్యక్షా,
ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళాపై నేనిప్పుడు మాట్లాడబోతున్నాను. ఈ గౌరవ సభ ద్వారా లక్షలాది మంది దేశ ప్రజలకు నమస్కరిస్తున్నాను. వారి సహకారంతోనే మహా కుంభమేళా విజయవంతమైంది. ఈ బృహత్ కార్యక్రమం విజయవంతం కావడంలో అనేక మంది వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వం, సమాజం, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికే అంకితమై సేవలందించిన కార్మికులందరికీ నా అభినందనలు. దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులకు, ఉత్తరప్రదేశ్ ప్రజలకు, ప్రత్యేకించి ప్రయాగరాజ్ వాసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అధ్యక్షా,
అసాధారణ కృషి వల్లే పవిత్ర గంగానది భూమికి దిగివచ్చిందని మనందరికీ తెలుసు. ఈ మహా కుంభమేళాను వైభవోపేతంగా నిర్వహించడంలోనూ అలాంటి విశేషమైన కృషినే మనం చూశాం. ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ‘సబ్ కా ప్రయాస్’ ఎంత ముఖ్యమైనదో నేను ప్రముఖం ప్రస్తావించాను. మహా కుంభమేళా ద్వారా భారత్ తన విశాలతను ప్రపంచానికి చాటింది. ఇది ‘సబ్ కా ప్రయాస్’ నిజమైన ఆదర్శం. ఈ మహా కుంభమేళా ప్రజల పండుగ. అశేష ప్రజానీకపు భక్తి, నిబద్ధతలే దీనికి స్ఫూర్తి.
అధ్యక్షా,
మహా కుంభమేళాలో మన జాతీయ చేతన అద్భుత స్థాయిలో మేల్కొన్నది. ఈ జాతీయ చైతన్యమే మన దేశాన్ని కొత్త సంకల్పం దిశగా నడిపించి, వాటిని సాకారం చేసుకునేలా మనకు ప్రేరణ కలిగిస్తుంది. మన సమష్టి శక్తిపై కొంతమందికి ఉన్న సందేహాలు, ఆందోళనలకు కూడా మహా కుంభమేళా తగిన సమాధానాన్నిచ్చింది.
అధ్యక్షా,
రాబోయే వెయ్యేళ్ల కోసం దేశం ఎలా స్వయంసన్నద్ధత సాధిస్తోందో గతేడాది అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా వీక్షించాం. మరో ఏడాదిలోనే మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహించడం ఈ విశ్వాసాన్ని మరింతగా బలోపేతం చేసింది. ఈ సమష్టి చైతన్యం అపారమైన దేశ సమర్థతను ప్రతిబింబిస్తుంది. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచే మహత్తర ఘటనలు చరిత్ర నిండా ఉన్నాయి. సరికొత్తగా దిశానిర్దేశం చేసిన, ప్రజానీకాన్ని మేల్కొల్పిన అలాంటి సంఘటనలు మన దేశంలోనూ ఉన్నాయి. భక్తి ఉద్యమ సమయంలో ఆధ్యాత్మిక జాగృతి దేశవ్యాప్తమయ్యింది. వందేళ్ల కన్నా ముందే స్వామి వివేకానందుడు షికాగోలో చేసిన ప్రసంగంలో భారత ఆధ్యాత్మిక చైతన్యం ప్రతిధ్వనించింది. భారతీయుల్లో దృఢతరమైన ఆత్మగౌరవ భావాలను పెంపొందించింది. అదే విధంగా మన స్వాతంత్ర్య పోరాటంలోనూ అటువంటి చారిత్రక ఘట్టాలు అనేకం ఉన్నాయి – 1857 తిరుగుబాటు, వీర భగత్ సింగ్ త్యాగం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ‘ఢిల్లీ చలో’ పిలుపు, మహాత్మా గాంధీ దండి యాత్ర వంటి అనేక ఉదాహరణలున్నాయి. ఈ ఘట్టాలన్నీ దేశంలో స్ఫూర్తిని రగిలించి, స్వాతంత్ర్యానికి మార్గం సుగమం చేశాయి. ప్రయాగరాజ్ మహా కుంభమేళాను అటువంటి మరో మహత్తర ఘట్టంగా నేను భావిస్తున్నాను. దేశ జాగరూకతా స్ఫూర్తి అందులో ప్రతిబింబించింది.

అధ్యక్షా,
భారత్ లో దాదాపు నెలన్నర రోజుల పాటు మహా కుంభమేళా ఉత్సాహాన్ని, స్ఫూర్తిని మనం ఆస్వాదించాం. ప్రగాఢమైన విశ్వాసంతో లక్షలాదిగా భక్తులు ఒక్క చోట చేరారు. వ్యయప్రయాసలను, కష్టనష్టాలను పట్టించుకోలేదు. ఈ అచంచలమైన భక్తి మనకున్న గొప్ప బలాలలో ఒకటి. అయితే, ఈ ఆనందోత్సాహాలు ఒక్క భారత్ కే పరిమితం కాలేదు. గతవారం నేను మారిషస్ కు వెళ్లాను. మహా కుంభమేళా సమయంలో ప్రయాగరాజ్ త్రివేణీ సంగమం నుంచి సేకరించిన పవిత్ర గంగా జలాన్ని నేను అక్కడికి తీసుకెళ్లాను. మారిషస్ లోని గంగా సరస్సు వద్ద ఈ పవిత్ర జలాన్ని సమర్పించిన సమయంలో భక్తి, విశ్వాసం, ఉత్సాహం నిండిన అద్భుతమైన వాతావరణం అక్కడ ఏర్పడింది. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, విలువలను ప్రపంచం అందిపుచ్చుకుని, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తోందని దీని ద్వారా మరోసారి స్పష్టమైంది.
అధ్యక్షా,
మన సాంస్కృతిక విలువలు ఒక తరం నుంచి మరో తరానికి ఎప్పటికప్పుడు ప్రసరిస్తున్న తీరును కూడా మనం గమనించవచ్చు. నేటి మన యువతను చూడండి — మహా కుంభమేళా, ఇతర సాంప్రదాయక పండుగలతో వారు ఎంతలా తాదాత్మ్యం చెందుతున్నారో. భారత యువతరం దేశ వారసత్వం, విశ్వాసం, సంస్కృతులను సగర్వంగా, భక్తిశ్రద్ధలతో అందిపుచ్చుకుంటోంది.
అధ్యక్షా,
సమాజం తన వారసత్వాన్ని సగర్వంగా స్వీకరిస్తే.. మహా కుంభమేళాలో మనం చూసినట్టు వైభవోపేతమైన, స్ఫూర్తిదాయకమైన ఘట్టాలు ఆవిష్కృతమవుతాయి. మన సౌబ్రాతృత్వ భావాన్ని ఇది బలోపేతం చేసి, ఒక దేశంగా గొప్ప లక్ష్యాలను మనం సాధించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మన సంప్రదాయాలు, విశ్వాసం, వారసత్వాలతో విశేషంగా అనుసంధానమవడం నేడు భారత్ కు అమూల్యమైన ఆస్తి.
అధ్యక్షా,
ఈ మహా కుంభమేళా మనకెన్నో విలువైన పాఠాలు నేర్పింది. ముఖ్యంగా ఐక్యతామృతాన్ని మనకు అందించింది. దేశంలోని ప్రతి ప్రాంతమూ, నలుమూలల నుంచీ ప్రజలు ప్రయాగరాజ్ లో ఒక్కచోటికి వచ్చారు. వ్యక్తిగత అహాలను పక్కనపెట్టి ‘నా’ బదులు ‘మన’ అన్న సమష్టి స్ఫూర్తిని ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాల ప్రజలు పవిత్ర త్రివేణీ సంగమంలో భాగమయ్యారు.వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది జాతీయవాద స్ఫూర్తిని బలోపేతం చేస్తే.. మన దేశ ఐక్యత మరింత బలపడుతుంది. వివిధ భాషల ప్రజలు సంగమ తీరాన ‘హర్ హర్ గంగే’ అని నినదించిన వేళ.. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావన మరింత స్పష్టంగా వ్యక్తమై, ఐక్యతను బలోపేతం చేస్తుంది. పేదా గొప్పా అనే తేడా లేదని మహా కుంభమేళా నిరూపించింది. — అపారమైన భారత శక్తిని ఇది ప్రతిబింబించింది. బలమైన ఐక్యతా భావం మనకు స్వభావసిద్ధమైనదని ఇది మరోసారి స్పష్టం చేసింది. మన ఐక్యతా శక్తి చాలా గొప్పది. మనల్ని విభజించేందుకు ప్రయత్నించే కుయుక్తులన్నింటినీ అది అధిగమించగలదు. ఈ అచంచలమైన చైతన్య స్ఫూర్తే ప్రతీ భారతీయుడికీ రక్ష. ప్రపంచం విచ్ఛిన్నతల ముప్పును ఎదుర్కొంటున్న వేళ.. సోదర భావాన్ని ప్రకటించేలా సాగిన ఈ గొప్ప వేడుక మనకెంతో బలాన్నిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వమే ఎల్లప్పుడూ భారత్ లక్షణం – ఎప్పుడూ దానినే మనం విశ్వసించాం, ఆస్వాదించాం, ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో అత్యంత అద్భుతమైన స్థాయిలో దాన్ని మనం గమనించాం. భిన్నత్వంలో ఏకత్వమనే ఈ విశిష్ట వారసత్వాన్ని పెంపొందించడం, బలోపేతం చేయడం మన బాధ్యత.
అధ్యక్షా,
మహా కుంభమేళా అనేక విధాలుగా మనకు ప్రేరణను అందించింది. ఎన్నో చిన్నా పెద్దా నదులకు మన దేశం నిలయం. వాటిలో కొన్నిప్పుడు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. మహా కుంభమేళా స్ఫూర్తితో నదీ ఉత్సవాల సంప్రదాయాన్ని మరింత విస్తృతం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ కార్యక్రమాలు నీటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవడంలో, నదీ స్వచ్ఛతను ప్రోత్సహించడంలో, నదుల సంరక్షణ ప్రాధాన్యాన్ని గుర్తించడంలో ఇప్పటి తరానికి దోహదపడతాయి.
అధ్యక్షా,
మహా కుంభమేళా నుంచి పొందిన జ్ఞాన సుధ మన దేశ సంకల్పాలను సాకారం చేసుకునేందుకు బలమైన పునాదిగా ఉపయోగపడుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. మరోసారి, మహా కుంభమేళా నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ అభివాదాలు.ఈ గౌరవ సభ తరపున వారందరికీ నా శుభాకాంక్షలు.