
హిస్ ఎక్స్ లెన్సీ శ్రీ డాన్ బ్రోయిలెట్టే, అమెరికా ఇంధనశాఖ సెక్రటరీ,
హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్, సౌదీ అరేబియా ఇంధన మంత్రి,
డాక్టర్ డేనియల్ ఎర్గిన్, వైస్ ఛైర్మెన్, ఐహెచ్ ఎస్ మార్కిట్,
నా మంత్రి వర్గ సహచరుడు శ్రీ ధర్మేంద్ర ప్రదాన్, ప్రపంచ చమురు, సహజవాయువు పరిశ్రమల సారథులకు
నమస్తే !
ఇండియా ఎనర్జీ ఫోరం సెరా వారోత్సవ నాలుగో ఎడిషన్ సందర్భంగా మిమ్మల్నందరినీ కలుసుకోవడం ఆనందంగా వుంది. ఇంధన రంగానికి విశిష్టమైన సేవలందిస్తున్నందుకుగాను డాక్టర్ డేనియల్ ఎర్గిన్ కు నా అభినందనలు. ఈ మధ్యనే ఆయన ది న్యూ మ్యాప్ అనే పుస్తకాన్ని రాశారు. అందుకుగాను ఆయన్ను ప్రశంసిస్తున్నాను.
స్నేహితులారా,
ఈ ఏడాది ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక అంశం ఎంతో సముచితమైనది. మారుతున్న ప్రపంచంలో భారతదేశ ఇంధన భవిష్యత్తు అనేది ఈ ఏడాది ప్రత్యేక అంశం. మీ అందరకీ భరోసా ఇస్తున్నాను. భారతదేశంలో కావలసినంత ఇంధనం వుంది. భారతదేశ ఇంధన భవిష్యత్ ఉజ్వలంగాను, భద్రంగాను వుంది. అది ఎలాగో వివరిస్తాను.
స్నేహితులారా,
ఈ ఏడాది ఇంధన రంగానికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఇంధన డిమాండ్ దాదాపుగా మూడింట ఒక వంతు పడిపోయింది. ధరలకు సంబంధించి అస్థిరత నెలకొంది. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు ప్రభావితమయ్యాయి. రాబోయే కొన్ని సంవత్సరాలపాటు ప్రపంచవ్యాప్తంగా ఇంధన డిమాండ్ ఇలాగే వుంటుందని ప్రముఖ అంతర్జాతీయ సంస్థల అంచనాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇవే సంస్థలు వేస్తున్న అంచనా ప్రకారం ప్రధాన ఇంధన వినియోగదారుల్లో భారతదేశం ముందువరసలో వుంటుంది. దీర్ఘకాలం చూసినప్పుడు భారతదేశ ఇంధన వినియోగం రెండింతలు కానున్నది.
స్నేహితులారా,
ఈ ఇంధన వినియోగ వృద్ధి అనేది పలు రంగాల్లో మనం చూడవచ్చు. ఉదాహరణకు విమానయాన రంగాన్నే తీసుకుందాం. దేశీయ విమానయానరంగాన్ని తీసుకుంటే ఈ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం మూడోస్థానంలో వుంది. 2024 నాటికల్లా భారతదేశ విమాన సంస్థలు తమ విమానాల సంఖ్యను ఆరువందలనుంచి 1200లకు పెంచనున్నాయి. ఇది ఈ రంగంలో ఒక పెద్ద ముందడుగు.
స్నేహితులారా,
ఇంధనం అనేది నాణ్యంగా వుండి అందరికీ అందుబాటులో వుండాలనే విషయాన్ని భారతదేశం నమ్ముతోంది. సామాజిక ఆర్ధిక రంగాల్లో మార్పు వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. ప్రజలను సాధికారులను చేయడానికి ఇంధన రంగం దోహదం చేస్తుందని అది సులభతర జీవనాన్ని ముందుకు తీసుకుపోతుందని మనం భావిస్తున్నాం. భారతదేశం నూటికి నూరుశాతం విద్యుదీకరణ సాధించింది. ఎల్ పిజి కవరేజీ పెరిగింది. ఈ మార్పులు ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాలకు, మధ్యతరగతివారికి, మహిళలకు ఉపయోగపడ్డాయి.
స్నేహితులారా,
భారతదేశ ఇంధన ప్రణాళిక అనేది ఈ రంగంలో న్యాయం చేయడానికి ఉద్దేశించినది. అది కూడా సుస్థిర వృద్ధికి సంబంధించి అంతర్జాతీయంగా అనుసరించాల్సిన నిబద్దతను కలిగి వుంటూనే సాధించాలి. దీని అర్థం భారతీయుల జీవితాలను మెరుగుపరచడానికిగాను ఇంధన వినియోగం పెంచుకోవాల్సి వుంటుంది. అయితే అదే సమయంలో తక్కువ కార్బన్ ఉద్గారాలతోనే వినియోగం వుంటుంది.
స్నేహితులారా,
భారతదేశం ఇంధనరంగమనేది వృద్ధి కేంద్రంగా, పారిశ్రామిక హితంగా, పర్యావరణ స్పృహతో వుంది. అందుకే, పున: వినియోగ ఇంధన వనరుల విషయంలో భారతదేశం అత్యధిక చైతన్యవంతమైన దేశంగా పరిగణించబడుతోంది.
స్నేహితులారా,
గత ఆరేళ్లలో, దేశవ్యాప్తంగా 36 కోట్లకు పైగా లేదా 360 మిలియన్లకు పైగా లెడ్ బల్బులను పంపిణీ చేయడం జరిగింది. అంతే కాదు లెడ్ బల్బుల ధర కూడా పదింతలు తగ్గించగలిగాం. గత ఆరేళ్లలో దేశవ్యాప్తంగా 1.1 కోట్ల లేదా 11 మిలియన్ స్మార్ట్ లెడ్ వీధి దీపాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పని చేయడంవల్ల ప్రతి ఏడాది 60 బిలియన యూనిట్ల ఇంధనాన్ని పొదుపు చేయగలిగాం. ఈ కార్యక్రమంద్వారా ప్రతి ఏడాది 4.5 కోట్ల లేదా 45 మిలియన్ టన్నుల కార్బన్ ఉత్పత్తిని తగ్గించి ఆ మేరకు గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించగలిగాం. దీంతోపాటు ఈ కార్యక్రమంద్వారా ప్రతి ఏడాది 24 వేల కోట్ల రూపాయలు, లేదా 240 బిలియన్ రూపాయలను ఆదా చేయగలుగుతున్నాం. ఇలాంటి చర్యల కారణంగా స్వచ్ఛ ఇంధన పెట్టుబడి మార్కెట్ గా భారతదేశం అవతరిస్తోందని నివేదికలు చెబుతున్నాయి.
స్నేహితులారా,
నేను ముందే చెప్పినట్టుగా, ప్రపంచ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొనే ఎల్లప్పుడూ భారతదేశం పని చేస్తుంది. ప్రపంచ ప్రజలకోసం ఇచ్చిన హామీని నెరవేర్చే పనిలో మేం నిబద్దతతో పని చేస్తున్నాం. 2022 నాటికి 175 గిగావాట్ల పున: ఇంధన సామర్థ్యాన్ని పెంచుతామనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ లక్ష్యాన్ని 2030 నాటికి 450 గిగావాట్లకు పెంచుకోవడం జరిగింది. పారిశ్రామిక దేశాలతో పోల్చితే భారతదేశం అతి తక్కువ కార్బన్ ఉద్గారాలను కలిగి వుంది. అయినప్పటికీ మేం వాతావరణ మార్పులపై పోరాటాన్ని కొనసాగిస్తున్నాం.
స్నేహితులారా,
గత ఆరేళ్లుగా భారతదేశ సంస్కరణ ప్రయాణం అత్యంత వేగంగా కొనసాగుతోంది. ఇంధన రంగంలో అసాధారణమైన సంస్కరణలు తీసుకురావడం జరిగింది. గత ఏడాది ఫిబ్రవరి నాటికి అన్వేషణ, లైసెన్సుల విధానంలో సంస్కరణలు కొలిక్కి వచ్చాయి ఇప్పుడు మా దృష్టి అంతా ఆదాయంనుంచి అధిక ఉత్పత్తి సాధన మీద వుంది. 2025 నాటికి రిఫైన్ సామర్థ్యాలను 250 మిలియన్ మెట్రిక్ టన్నులనుంచి 400 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచడానికి విధానాలను రూపొందించుకుంటున్నాం. దీనికి సంబంధించి అత్యధిక పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నాం. దేశీయంగా సహజవాయువు ఉత్పత్తిని పెంచడమే ప్రభుత్వం ముందు వున్న ముఖ్యమైన ప్రాధాన్యత. ఒకే దేశం- ఒకే గ్రిడ్ అనే విధానాన్ని సాధించడానికి, గ్యాస్ ఆధారిత ఆర్ధికవ్యవస్థవైపు మరలడానికి మేం ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం.
స్నేహితులారా,
చాలా రోజులుగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం తగ్గడం మరలా పెరగడం అన్నట్టుగా కొనసాగుతున్నాయి. బాధ్యతాయుతమైన ధరలను మనం సాధించాల్సి వుంది. చమురు, సహజవాయువు ఈ రెండు మార్కెట్లకు సంబంధించి పారదర్శకమైన, అనువైన మార్కెట్లను రూపొందించుకునేదిశగా కృషి చేయాలి.
స్నేహితులారా,
దేశీయంగా సహజవాయువు ఉత్పత్తిని పెంచుకోవడానికిగాను, సహజవాయువు మార్కెట్ ధరలను ఒకే విధంగా వుండేలా చేయడానికిగాను ఈ నెల ప్రారంభంలో మేం సహజవాయువు మార్కెట్ సంస్కరణల్ని ప్రకటించడం జరిగింది. వీటి కారణంగా ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ద్వారా సహజవాయువు అమ్మకాలకు సంబంధించి అత్యధిక మార్కెట్ స్వేచ్ఛ లభిస్తుంది. ఈ ఏడాది జూన్ నెలలో భారతదేశ మొట్టమొదటి ఆటోమేటిక్ జాతీయ స్థాయి సహజవాయువు వాణిజ్య వేదికను ప్రారంభించడం జరిగింది. సహజవాయువు మార్కెట్ ధరను నిర్ణయించడానికిగాను ఈ వేదిక ప్రమాణాలతోకూడిన విధివిధానాలను తయారు చేస్తుంది.
స్నేహితులారా,
ఆత్మనిర్భర్ భారత్ అనే దార్శనికతతో మేం ముందుకు సాగుతున్నాం. ప్రపంచ ఆర్ధిక రంగాన్ని బలోపేతం చేయడానికి స్వయం సమృద్ధ భారతదేశం కూడా ఉపయోగపడుతుంది. మా కృషిలో ముఖ్యమైంది ఇంధన భద్రతను సమకూర్చుకోవడం. మా కృషి సానుకూల ఫలితాలను ఇస్తోందనే విషయం తెలిస్తే మీరు సంతోషిస్తారు. ఈ కరోనా సవాళ్ల సమయంలో కూడా చమురు, సహజవాయువు రంగాన్నించి మాకు పెట్టుబడులు వచ్చాయి. ఇతర రంగాల్లో కూడా మాకు అలాంటి సూచనలు కనిపిస్తున్నాయి.
స్నేహితులారా,
ప్రపంచవ్యాప్తంగాగల ప్రతిష్టాత్మక ఇంధన కంపెనీలతో వ్యూహాత్మక, సమగ్రమైన ఇంధన భాగస్వామ్యాలను పెట్టుకుంటున్నాం. ముందుగా ఇరుగుపొరుగువారు ముఖ్యమనే విధానం మా దేశానిది. దీని ప్రకారం పరస్పర ప్రయోజనాలకోసం మా ఇరుగుపొరుగు దేశాల్లో ఇంధన కారిడార్లను అభివృద్ధి చేసుకోవడం జరుగుతోంది.
స్నేహితులారా,
మానవ ప్రగతి ప్రయాణాన్ని వెలుగులతో నింపేది సూర్య కిరణాలే. భగవాన్ సూర్యనారాయణుని రథాన్ని ఏడు గుర్రాలు నడుపుతున్నట్టే భారతదేశ ఇంధన పటాన్ని నిలబెట్టడానికి కూడా ఏడు ప్రధానమైన అంశాలు దోహదం చేస్తున్నాయి. మార్పుకు పనికొస్తున్న ఈ అంశాలు ఇలా వున్నాయి.
1. భారతదేశాన్ని సహజవాయువు ఆధారిత ఆర్ధిక శక్తిగా రూపొందించడానికిగాను చేపట్టిన చర్యలను వేగవంతం చేయడం.
2. శిలాజ ఇంధనాలను ముఖ్యంగా చమురు, బొగ్గులను పర్యావరణహితంగా వినియోగించడం
3. జీవ ఇంధనాల వినియోగం పెంచడానికిగాను దేశీయ వనరులపై అధికంగా ఆధారపడడం
4. 2030 నాటికి 450 గిగావాట్ల పున: వినియోగ ఇంధన లక్ష్యాన్ని సాధించడం.
5. కార్బన్ రహిత మొబిలిటీకోసం విద్యుత్ వాటాను పెంచడం.
6. హైడ్రోజన్ తో సహ వెలుగులోకి వస్తున్న ఇంధనాల వినియోగంవైపు మరలడం.
7. అన్ని ఇంధన వ్యవస్థల్లో డిజిటల్ ఆవిష్కరణల్ని ప్రవేశపెట్టడం.
గత ఆరు సంవత్సరాలుగా అమలులో వున్న ఈ ఉజ్వలమైన ఇంధన విధానాలను కొనసాగించడం జరుగుతుంది.
స్నేహితులారా,
పరిశ్రమలకు, ప్రభుత్వానికి, సమాజానికి మధ్యన ఒక ముఖ్యమైన వేదికగా భారతదేశ ఇంధన వేదిక – సెరా వీక్ కృషి చేస్తోంది. మెరుగైన ఇంధన భవిష్యత్ కోసం ప్రయోజనకరమైన ఆలోచనల్ని అందించడానికిగాను ఈ సమావేశం ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. భారతదేశ ఇంధనరంగం ప్రపంచ ఇంధనరంగానికి కావలసిన శక్తిని ఇస్తుందని నేను మరలా ప్రత్యేకంగా చెబుతున్నాను. అందరికీ కృతజ్ఞతలు.