QuoteIndia is being seen as a bright spot. Growth is projected to remain among the highest in the world: PM
QuoteIn less than 3 years, our government has transformed the economy: PM Modi
QuoteFinancial markets can play an important role in the modern economy, says the Prime Minister
QuoteGovernment is very keen to encourage start-ups. Stock markets are essential for the start-up ecosystem: PM
QuoteMy aim is to make India a developed country in one generation: PM Narendra Modi

ఈ కొత్త కేంపస్ ను ప్రారంభించేందుకు ఈ రోజు ఇక్క‌డ‌కు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అంత‌ర్జాతీయంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో మంద‌గ‌మ‌నం చోటు చేసుకున్న రోజులివి. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు.. ఈ రెండూ అభివృద్ధిలో మంద‌కొడిత‌నాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌తదేశాన్ని ఒక ప్రకాశవంతమైన కేంద్రంగా చూస్తున్నారు. ఇక్కడ వృద్ధి రేటు ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే అత్యున్నత స్థాయిలో ఉండగలదని అంచ‌నా వేస్తున్నారు.

త్వ‌రిత‌గ‌తిన అభివృద్ధి చెందుతున్న దేశంగా భార‌తదేశం స్థానం ఏదో అకస్మాత్తుగా వ‌చ్చినదేమీ కాదు. మ‌నం ఎంతవరకు ప్ర‌యాణించామో ఒక సారి చూడాలీ అంటే, 2012-13కేసి చూడాలి. అప్పట్లో కోశ సంబంధి లోటు ఆందోళ‌న‌క‌ర స్థాయిలకు చేరుకొంది. క‌రెన్సీ విలువ అమాంతం ప‌డిపోసాగింది. ద్ర‌వ్యోల్బ‌ణం అధికంగా ఉండింది. క‌రెంటు ఖాతా లోటు పెరుగుతోంది. మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ పట్ల విశ్వాసం సన్నగిలింది. విదేశీ పెట్టుబ‌డిదారులు భారతదేశం నుండి వెనుదిరుగుతూ ఉన్నారు. బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్‌) సభ్యత్వ దేశాల‌లో భారతదేశాన్ని అత్యంత బ‌ల‌హీన‌మైన దేశంగా భావించారు.

మూడు సంవత్స‌రాల‌ లోపే ఈ ప్ర‌భుత్వం ఆర్థిక వ్య‌వ‌స్థ గ‌తిని మార్చింది. ప్ర‌తి ఏడాదీ కోశ సంబంధి లోటును త‌గ్గించే విధంగా ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. అందుకు అనుగుణంగా ప్ర‌తి ఏడాదీ ల‌క్ష్యాన్ని చేరుకున్నాం. క‌రెంటు ఖాతా లోటు త‌క్కువ‌గా ఉంది. 2013లో ప్ర‌త్యేక క‌రెన్సీ స్వాప్ కింద తీసుకున్న రుణాల‌ను తీర్చిన త‌రువాత కూడా విదేశీ మార‌క ద్ర‌వ్య నిల్వ‌లు అధికంగా ఉన్నాయి. ద్ర‌వ్యోల్బ‌ణం త‌గ్గింది. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో రెండంకెల స్థాయిలో ఉన్న ద్ర‌వ్యోల్బ‌ణం నాలుగు శాతం కంటె త‌క్కువ‌కు వ‌చ్చి చేరింది. మొత్తంగా కోశ సంబంధి లోటులో భారీగా కోత పెట్టిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ పెట్టుబ‌డులు భారీగా పెరిగాయి. ద్ర‌వ్యోల్బ‌ణ ల‌క్ష్యాల‌తో కొత్త ద్ర‌వ్య విధాన ప్ర‌ణాళిక‌కు రూప‌క‌ల్ప‌న జ‌రిగింది. వ‌స్తు సేవ‌ల ప‌న్ను - జిఎస్‌టి కి సంబంధించి రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉంటూ వ‌చ్చింది. అది ఆమోదం పొందింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జిఎస్‌టి త్వ‌ర‌లోనే ఆచ‌ర‌ణ‌లోకి రానుంది. సుల‌భ‌త‌ర వ్యాపారానికి ప‌రిస్థితులు మెరుగుప‌ర‌చ‌డంలో ప్ర‌గ‌తి సాధించాం. ఈ చ‌ర్య‌ల‌న్నింటి ఫ‌లితంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డు స్థాయిలకు చేరాయి. ఐదు వంద‌లు, వెయ్యి రూపాయ‌ల నోట్ల చెలామ‌ణి ర‌ద్దు నిర్ణ‌యం వ‌ల్ల శ‌ర‌వేగంతో దూసుకుపోతున్న కారుకు బ్రేకులు ప‌డ్డాయ‌న్న మన విమ‌ర్శ‌కులు కూడా మన పురోగతి యొక్క వేగాన్ని గుర్తించారు.

|

ఈ సంద‌ర్భంగా నన్నొక విష‌యాన్ని సుస్ప‌ష్టం చేయనివ్వండి. దీర్ఘ‌కాలికంగా భార‌తదేశానికి మంచి భ‌విష్య‌త్తు ఉండేలా ప్ర‌భుత్వం స‌మ‌ర్ధ‌మైన ఆర్థిక విధానాల‌ను అనుస‌రిస్తుంది. స్వ‌ల్ప‌కాలిక రాజ‌కీయ ల‌బ్ధి కోసం మేం నిర్ణ‌యాలు తీసుకోం. దేశ ప్ర‌యోజ‌నాల కోసం ఉప‌యోగ‌ప‌డుతుంద‌నుకుంటే క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి ఏమాత్రం వెనుకాడం. ఐదు వంద‌ల రూపాయలు, వెయ్యి రూపాయ‌ల నోట్ల చెలామ‌ణి ర‌ద్దు నిర్ణ‌యం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. దీనివ‌ల్ల స్వ‌ల్ప‌కాలంలో ఇబ్బందులు ఉంటాయి కానీ, దీర్ఘ‌కాలంలో ఇది లాభాలు తీసుకువస్తుంది.

ఆధునిక ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో ఆర్థిక మార్కెట్లు కీల‌క పాత్రను పోషించగలవు. ఇవి పొదుపు మొత్తాల సమీకరణలో దోహదం చేస్తాయి. అవి పొదుపు మొత్తాల‌ను ఉత్పాద‌క పెట్టుబ‌డుల వైపునకు మ‌ళ్లించ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

అయితే, మ‌రోవైపు ఆర్థిక మార్కెట్లు సైతం- వాటిని తగిన రీతిలో నియంత్రించ‌కపోతే- న‌ష్టాన్ని క‌ల‌గ‌జేయగలవన్న సంగతిని చ‌రిత్ర‌ చెబుతోంది. చక్కని నియంత్ర‌ణ కోసం ప్ర‌భుత్వం సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ని ఏర్పాటు చేసింది. ఆరోగ్య‌క‌ర‌మైన సెక్యూరిటీల మార్కెట్ అభివృద్ధి చెందేటట్లు సెబీ కూడా కీల‌క పాత్రను పోషించవలసి ఉంది.

ఇటీవ‌ల‌, ఫార్వ‌ర్డ్ మార్కెట్స్ క‌మిష‌న్‌ను ర‌ద్దు చేయ‌డం జ‌రిగింది. క‌మాడిటీల డెరివేటివ్‌ల నియంత్ర‌ణ ల‌క్ష్యాన్ని కూడా సెబీకి అప్ప‌గించ‌డం జ‌రిగింది. ఇది ఒక పెద్ద స‌వాలు. క‌మాడిటీల మార్కెట్ విష‌యానికి వ‌స్తే, స్పాట్ మార్కెట‌ను సెబి నియంత్రించ‌డం లేదు. వ్య‌వ‌సాయ మార్కెట్ల‌ను రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు నియంత్రిస్తాయి. చాలా వ‌ర‌కు స‌ర‌కులు పేద‌లు, అవ‌స‌ర‌మున్న వారు నేరుగా కొనుగోలు చేస్తారు గాని పెట్టుబ‌డిదారులు కాదు. అందువ‌ల్ల క‌మాడిటీ డెరివేటివ్‌ల ఆర్థిక‌, సామాజిక ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది.

|

ఫైనాన్షియ‌ల్ మార్కెట్లు విజ‌య‌వంతంగా ప‌నిచేయాలీ అంటే, ఈ ప్ర‌క్రియ‌లో పాల్గొనే వారికి స‌మాచారం పూర్తిగా అందాలి. నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ సెక్యూరిటీస్ మార్కెట్ వివిధ వ‌ర్గాల వారిని విజ్ఞాన‌వంతుల‌ను చేసే బాధ్య‌త‌ను , నైపుణ్య ధ్రువీక‌ర‌ణ‌ను చేప‌డుతుండ‌డం నాకు సంతోషంగా ఉంది. ప్ర‌స్తుతం నైపుణ్య భార‌త దేశాన్ని నిర్మించ‌డం మ‌న ల‌క్ష్యంగా ఉంది. మ‌న దేశ యువ‌త ప్ర‌పంచంలోని ఏ ప్రాంతంలోని వారితోనైనా పోటీప‌డే విధంగా ఉండాలి. ఇలాంటి సామ‌ర్ధ్యాల క‌ల్ప‌న‌లో ఈ సంస్థ కీల‌క పాత్ర పోషించాలి. ప్ర‌తి సంవ‌త్స‌రం ల‌క్షా యాభైవేల మంది ఎన్‌ఐఎస్‌ఎం ప‌రీక్ష రాస్తున్నట్లు నా దృష్టికి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు ల‌క్ష‌ల మంది అభ్య‌ర్ధుల‌కు ఎన్ఐఎస్‌ఎం స‌ర్టిఫికెట్లు అంద‌జేసింది.

స‌రైన నియంత్ర‌ణ‌లున్న సెక్యూరిటీ మార్కెట్‌లు గ‌ల దేశంగా భార‌త దేశానికి మంచి పేరు ఉంది. ఎలక్ట్రానిక్ విధానంలో ట్రేడింగ్‌, డిపాజిట‌రీల వినియోగం మ‌న మార్కెట్లు మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా ఉండేటట్టు చేశాయి. ఒక స‌ంస్థగా సెబి కూడా ఈ విషయంలో గర్వపడొచ్చు.

అయితే, మ‌న సెక్యూరిటీలు, క‌మాడిటీల మార్కెట్ లు ఇంకా ఎంతో దూరం పయనించవలసి ఉంది. నేను ఆర్థిక రంగ ప‌త్రిక‌లను తిరగేస్తున్న‌ప్పుడు ఐపిఒ ల విజ‌యం గురించి, కొంత మంది తెలివైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నట్టుండి ఎలా బిల‌ియ‌నీర్ గా మారిందీ తరచుగా చ‌ూస్తుంటాను. మా ప్ర‌భుత్వం స్టార్ట్-అప్‌ ల‌ను ప్రోత్స‌హించ‌డానికి సిద్ధంగా ఉంది. స్టార్ట్-అప్‌ లు బాగండ‌డానికి స్టాక్ మార్కెట్‌లు అవ‌స‌రం. అంత‌ర్జాతీయ పెట్టుబ‌డిదారులు, ఆర్థిక‌ రంగ నిపుణులు సెక్యూరిటీల మార్కెట్లు విజ‌య‌వంత‌మ‌య్యాయ‌ని అంటే స‌రిపోదు. సంప‌ద సృష్టి మంచిదే. అయితే అదే దాని ప్ర‌యోజ‌నం కాద‌న్న‌ది నా భావ‌న‌. నిజానికి మ‌న సెక్యూరిటీల మార్కెట్ అస‌లు విలువ‌, వారి చ‌ర్య‌లు

• దేశ అభివృద్ధికి ఉప‌యోగ‌ప‌డ‌డంలోను,

• అన్నిరంగాలు మెరుగుప‌డేందుకు దోహ‌ద‌ప‌డ‌డంలోను,

• మెజారిటీ ప్ర‌జ‌ల సంక్షేమానికి ఉప‌క‌రించ‌డంలోను ఇమిడి ఉంటాయి.

అందువ‌ల్ల‌, ఫైనాన్షియ‌ల్ మార్కెట్లు పూర్తిగా విజ‌యం సాధించినట్లు నేను భావించాలీ అంటే, అవి మూడు స‌వాళ్ల‌ను ఎదుర్కోవలసి ఉంటుంది.

ముందుగా, ఉత్పాద‌క ప్ర‌యోజ‌నాల కోసం పెట్టుబ‌డ‌ులను స‌మీక‌రించేందుకు తోడ్పడడం మ‌న స్టాక్ మార్కెట్ల ప్రధాన ధ్యేయంగా ఉండాలి. డెరివేటివ్‌లు రిస్క్ నిర్వ‌హ‌ణ‌లో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కానీ చాలామంది ప్ర‌జ‌లు డెరివేటివ్‌లు మార్కెట్‌పై ఆధిప‌త్యాన్ని చూపుతున్నాయ‌ని, కుక్క తోక దాని త‌లను ఆడించిన‌ట్టుగా త‌యారైంద‌ని భావిస్తుంటారు. పెట్టుబ‌డిని స‌మ‌కూర్చే ప్ర‌ధాన ల‌క్ష్యాన్ని నెర‌వేర్చేందుకు కేపిట‌ల్ మార్కెట్ ఎంత స‌మ‌ర్థంగా ప‌నిచేస్తుంద‌న్న‌ది మ‌నం ఆలోచించాలి.

మ‌న మెజారిటీ ప్ర‌జ‌లకు ల‌బ్ధి చేకూర్చ‌గ‌ల ప్రాజెక్టుల‌కు పెట్టుబ‌డిని విజ‌య‌వంతంగా స‌మ‌కూర్చ‌గ‌ల సామ‌ర్ధ్యం త‌మ‌కు ఉంద‌ని మ‌న మార్కెట్లు చూపించాలి. ప్ర‌త్యేకించి, మౌలిక స‌దుపాయాల రంగం గురించి నేను ఈ ప్ర‌స్తావిస్తున్నాను. ఈ రోజు చాలా వ‌ర‌కు మ‌న మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌కు నిధుల‌ు ప్ర‌భుత్వం ద్వారా లేదా బ్యాంకుల ద్వారా స‌మ‌కూరుతున్నాయి.. మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌కు కేపిట‌ల్ మార్కెట్‌ను ఉప‌యోగించ‌డం త‌క్కువ‌. మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టులకు ఆచ‌ర‌ణ సాధ్య‌త‌ ఉండాలంటే, వాటికి నిధుల స‌మీక‌ర‌ణ దీర్ఘ‌కాలిక ప్రాతిప‌దిక‌పై ఉండాలి. మ‌న‌కు దీర్ఘ‌కాలిక లిక్విడ్ బాండ్ మార్కెట్ లేద‌ని అంటారు. ఇందుకు చాలా కార‌ణాలు చెబుతారు. ఇక్క‌డ చేరిన ఆర్థిక నిపుణులు మ‌న‌సు పెడితే ఈ స‌మ‌స్య‌కు త‌గిన ప‌రిష్కారాన్ని సాధించ‌గ‌ల‌ర‌న్న నమ్మకం నాకుంది. మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌కు దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డిని స‌మ‌కూర్చేందుకు అనువైన మార్గాల‌ను అన్వేషించాల్సిందిగా మిమ్మ‌ల‌ను కోరుతున్నాను. మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌కు ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం గాని, లేదా విదేశీ రుణ సంస్థ‌లైన ప్ర‌పంచ బ్యాంకు, లేదా జెఐసిఎ వంటివి గాని దీర్ఘ‌కాలిక నిదుల‌ను స‌మ‌కూరుస్తున్నాయి. మ‌నం ఆ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డాలి. దీర్ఘ‌కాలిక మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌కు బాండ్ మార్కెట్ ఒక మార్గంగా ఉండాలి.

|

దేశంలో ప‌ట్ట‌ణ మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు అవ‌స‌ర‌మ‌న్న విష‌యం మీకు తెలుసు. ప్ర‌భుత్వం స్మార్ట్ సిటీల కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. ఈ నేప‌థ్యంలో, ఇప్ప‌టికీ మ‌న‌కు మ్యూనిసిప‌ల్ బాండ్ మార్కెట్ లేక‌పోవ‌డం నిరాశ క‌లిగిస్తోంది. ఇలాంటి మార్కెట్ క‌ల్పించ‌డంలో స‌మ‌స్య‌లు, క‌ష్టాలూ ఉన్నాయి. అయితే ఒక సంక్లిష్ట స‌మ‌స్య‌కు ప‌రిష్కారం సాధించిన‌పుడే నిపుణుల ఆవిష్క‌ర‌ణ‌ల‌కు నిజ‌మైన ప‌రీక్ష‌గా చెబుతాం. దేశంలోని క‌నీసం ప‌ది న‌గ‌రాల‌లో ఏడాదిలో మునిసిప‌ల్ బాండ్లు జారీ చేసేలా సెబి, ఆర్థిక వ్య‌వ‌హారాల విభాగం హామీ ఇవ్వ‌గ‌ల‌దా ?

రెండోది, స‌మాజంలోని అధికసంఖ్యాక వ‌ర్గం అంటే మ‌న రైతుల‌కు మార్కెట్లు ప్ర‌యోజ‌నం చేకూర్చాలి. విజ‌యానికి స‌రైన కొల‌మానం అది గ్రామాల‌పై ఎంత మేర‌కు ప్ర‌భావాన్ని చూపింద‌న్న‌ది తెలియ‌జేస్తుంది కానీ, ద‌లాల్‌ స్ట్రీట్‌, అధికార శ్రేణి గ‌ల ఢిల్లీ కాదు.ఈ ప్ర‌మాణం ప్ర‌కారం చూస్తే మనం చాల దూరం ప్ర‌యాణించాల్సి ఉంది. వ్య‌వ‌సాయరంగంలో ప్రాజెక్టుల కోసం మ‌నం వినూత్న ప‌ద్ధ‌తుల‌లో మ‌న స్టాక్ మార్కెట్లు పెట్టుబ‌డులు స‌మీక‌రించాలి. మ‌న క‌మాడిటీ మార్కెట్లు మ‌న రైతుల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉండాలి కాని కేవ‌లం స్పెక్యులేషన్‌కు అవ‌కాశం క‌ల్పించేదిగా ఉండ‌కూడ‌దు. రిస్క్ త‌గ్గించుకునేందుకు రైతులు డెరివేటివ్‌లు వాడ‌వ‌చ్చ‌ని ప్ర‌జ‌లు అంటుంటారు.అది నిజం. కాని, ఆచ‌ర‌ణ‌లో ఏ రైతూ డెరివేటివ్‌ను వాడ‌డం లేదు.ఇది నిజం. క‌మాడిటీ మార్కెట్‌ను మ‌నం నేరుగా రైతుల‌కు ఉప‌యోగ‌ప‌డేట్టు చేయ‌న‌ట్ట‌యితే,అది మ‌న ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌కు విలువైన ఆభ‌ర‌ణంగానే మిగిలిపోతుంది కాని అది ఉప‌యోగ‌క‌ర ఉప‌క‌ర‌ణంగా ఉండ‌దు. ఈ ప్ర‌భుత్వం ఇ- నామ్ ను అంటే.. ఎల‌క్ట్రానిక్ నేష‌న‌ల్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ మార్కెట్‌ను.. ప్ర‌వేశ‌పెట్టింది. రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు సెబి ఇ -నామ్ వంటి స్పాట్ మార్కెట్లు, డెరివేటివ్ మార్కెట్‌ల మ‌ధ్య స‌న్నిహిత సంబంధానికి కృషి చేయాలి.

ఇక మూడ‌వ‌ది, ఫైనాన్షియ‌ల్ మార్కెట్‌ నుండి ల‌బ్ధిని పొందుతున్న‌వారు, జాతి నిర్మాణానికి ప‌న్నుల రూపంలో వారి వంతు వాటాను చెల్లించాలి. మార్కెట్‌ల‌ నుండి ల‌బ్ధి పొందుతున్న‌వారి నుండి ప‌న్ను చెల్లింపులు వివిధ కార‌ణాల‌వ‌ల్ల త‌క్కువగా ఉంటున్నాయి. ఇది చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు, మోసాలు కూడా కొంత కార‌ణం కావ‌చ్చు. ఇలాంటి వాటికి అడ్డు క‌ట్ట వేయ‌డానికి సెబి మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ప‌న్ను చెల్లింపులు త‌క్కువ‌గా ఉండ‌డానికి మ‌న ప‌న్ను చ‌ట్టాల వ్య‌వ‌స్థ తీరు కూడా కార‌ణం కావ‌చ్చు. కొన్నిర‌కాల ఫైనాన్షియ‌ల్ ఆదాయాల‌పై త‌క్కువ ప‌న్ను లేదా అస‌లు ప‌న్ను క‌ట్టాల్సిన అవ‌స‌రం లేని స్థితి ఉంది. మార్కెట్ కార్య‌క‌లాపాలలో పాలుపంచుకుంటున్న వారు దేశ ఖ‌జానాకు ఏమేర‌కు తోడ్ప‌డుతున్నారో ప‌రిశీలించ‌ండని మిమ్మ‌ల్ని కోరుతున్నాను. ఖ‌జానాకు వీరి వాటా స‌రైన రీతిలో స‌మ‌ర్థంగా, పార‌ద‌ర్శ‌కంగా ఉండేటట్టు చూడాలి. ప‌లు ప‌న్ను ఒప్పందాలు ఉప‌యోగించుకొంటూ కొంద‌రు ఇన్వెస్ట‌ర్లు ల‌బ్ధి పొందుతున్నార‌న్న అభిప్రాయం గ‌తంలో ఉండేది. అలాంటి ఒప్పందాల‌ను ప్ర‌భుత్వం స‌వ‌రించిన విష‌యం మీకు తెలుసు. ఇప్పుడు స‌ర‌ళ‌మైన , పార‌ద‌ర్శ‌క‌మైన‌, నిష్పాక్షిక‌, ప్ర‌గ‌తిదాయ‌క న‌మూనాల‌తో ముందుకు వ‌చ్చేందుకు ఆలోచ‌న చేయ‌వ‌ల‌సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది.

మిత్రులారా,

బ‌డ్జెట్‌కు ఫైనాన్షియ‌ల్ మార్కెట్‌లు ఎంతో ప్రాధాన్య‌ాన్ని క‌లిగి ఉంటాయి. వాస్త‌వ ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌పై బ‌డ్జెట్ ప్ర‌భావం ఉంటుంది. మ‌న ప్ర‌స్తుత బ‌డ్జెట్ కేలండ‌ర్ ప్ర‌కారం ప్ర‌భుత్వ వ్య‌యానికి అనుమ‌తులు వ‌ర్షాకాలం ప్రారంభ‌మైన త‌ర్వాత వ‌స్తాయి. దీనితో వ‌ర్షాకాలానికి ముందు గ‌ల కీలక ఉత్పాద‌క నెల‌ల్లో ప్ర‌భుత్వ ప‌థ‌కాలు చురుకుగా ఉండ‌ని ప‌రిస్థితి. దీనితో మనం ఈ సంవ‌త్స‌రం నుండి బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌డాన్ని ముందుకు జ‌రుపుతున్నాం. ఫ‌లితంగా కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభానికి ముందే బ‌డ్జెట్ నిదుల వినియోగానికి ఆమోదం పొందే విధంగా మేం చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. ఇది ఉత్ప‌త్తిని, దిగుబ‌డిని మెరుగుప‌రుస్తుంది.

మిత్రులారా..

ఒక్క త‌రంలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాల‌న్న‌ది నా ధ్యేయం. ప్ర‌పంచ ప్ర‌మాణాలు గ‌ల సెక్యూరిటీల మార్కెట్ లు, క‌మాడిటీల మార్కెట్‌లు లేకుండా భారతదేశం అభివృద్ధి చెందిన దేశం కాజాల‌దు. అందువ‌ల్ల , ఈ నూత‌న శ‌కానికి అనుగుణంగా ఫైనాన్షియ‌ల్ మార్కెట్లు మ‌రింత అనువుగా ఉండే విధంగా చేయ‌డంలో మీ అంద‌రి స‌హ‌కారం మ‌రింత‌గా ఉండాల‌ని నేను కోరుకుంటున్నాను. ఎన్‌ఐఎస్‌ఎం విజ‌య‌వంతం కావాల‌ని నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగే, నేను ప్ర‌తి ఒక్క‌రికీ సంతోషభరితమైనటువంటి క్రిస్ మస్‌ శుభాకాంక్షలను మరియు చాలా ఆనందదాయకమయ్యేటటువంటి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లను తెలియ‌జేస్తున్నాను.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Manufacturing sector pushes India's industrial output growth to 5% in Jan

Media Coverage

Manufacturing sector pushes India's industrial output growth to 5% in Jan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing of Dr. Shankar Rao Tatwawadi Ji
March 13, 2025

The Prime Minister, Shri Narendra Modi condoled passing of Dr. Shankar Rao Tatwawadi Ji, today. Shri Modi stated that Dr. Shankar Rao Tatwawadi Ji will be remembered for his extensive contribution to nation-building and India's cultural regeneration."I consider myself fortunate to have interacted with him on several occasions, both in India and overseas. His ideological clarity and meticulous style of working always stood out" Shri Modi added.

The Prime Minister posted on X :

"Pained by the passing away of Dr. Shankar Rao Tatwawadi Ji. He will be remembered for his extensive contribution to nation-building and India's cultural regeneration. He dedicated himself to RSS and made a mark by furthering its global outreach. He was also a distinguished scholar, always encouraging a spirit of enquiry among the youth. Students and scholars fondly recall his association with BHU. His various passions included science, Sanskrit and spirituality.

I consider myself fortunate to have interacted with him on several occasions, both in India and overseas. His ideological clarity and meticulous style of working always stood out.

Om Shanti