QuoteCommissioning of the INS Kalvari in Indian Navy will further strengthen our defence sector: PM
QuoteINS Kalvari a fine example of ‘Make in India’ initiative, says PM Modi
QuoteGuided by the principle of SAGAR – Security And Growth for All in the Region, we are according highest priority to Indian Ocean region: PM

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ విద్యా సాగర్ రావు, రక్షణ మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సుభాష్ భామ్రే, జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజీత్ డోభాల్, ఫ్రాన్స్ రాయబారి శ్రీ అలెగ్జాండర్ జిగరల్ మరియు ఫ్రాన్స్ నుండి వచ్చిన ఇతర అతిథులు, నౌకాదళ ప్రధాన అధికారి, అడ్మిరల్ శ్రీ సునీల్ లాంబా, పశ్చిమ నౌకాదళ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ శ్రీ గిరీశ్ లూథ్రా గారు,
వైస్ అడ్మిరల్ డి.ఎమ్. దేశపాండే గారు, మఝ్ గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండిఎల్) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాకేశ్ ఆనంద్,

కెప్టెన్ శ్రీ ఎస్.డి. మెహన్ డేల్, ఇంకా నౌకాదళ ఇతర అధికారులతో పాటు సిబ్బంది, ఎండిఎల్ అధికారులు మరియు సిబ్బంది సహా ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర ఉన్నతాధికారులారా,

ఈ రోజు 1.25 బిలియన్ భారతీయులకు ఒక ముఖ్యమైన రోజు, పూర్తి గర్వకారణమైన రోజు. ఇటువంటి చరిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకుగాను నా దేశ ప్రజలందరికీ నేను నా హృదయ పూర్వక అభినందనలు తెలియ జేస్తున్నాను. ఐఎన్ఎస్ కల్వరీ జలాంతర్గామిని దేశానికి అంకితమివ్వడం నాకు లభించిన ఒక మంగళప్రదమైనటువంటి అవకాశం. దేశ ప్రజలందరి తరఫున నేను భారతదేశ నౌకాదళానికి అనేకమైన శుభాకాంక్షలను అందజేస్తున్నాను.

దాదాపు రెండు దశాబ్దాల విరామం అనంతరం, ఈ తరహా జలాంతర్గామిని భారతదేశం దక్కించుకొంది. నౌకాదళానికి చెందిన నౌకలలోకి కల్వరీ వచ్చి చేరడం రక్షణ రంగంలో మేం వేసినటువంటి ఒక పెద్ద ముందడుగు. దీనిని భారతీయులు వారి శక్తిని అంతటినీ వినియోగించి, చెమటోడ్చి మరీ తయారు చేశారు. ‘‘మేక్ ఇన్ ఇండియా’’ కు ఇది ఒక పెద్ద ఉదాహరణ. కల్వరీ నిర్మాణంలో నిమగ్నమైన ప్రతి కార్మికునికి, ప్రతి ఉద్యోగికి నా హృదయ పూర్వక అభినందనలు తెలియ జేస్తున్నాను. కల్వరీ నిర్మాణంలో సహకారం అందజేసిన ఫ్రాన్స్ కు కూడా నేను కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను. భారతదేశం, ఫ్రాన్స్ ల మధ్య వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి సైతం ఈ జలాంతర్గామి ఒక అద్భుతమైన ఉదాహరణ.

|

మిత్రులారా, భారతదేశ నౌకాదళంలో జలాంతర్గామి విభాగం ప్రవేశించి ఇది స్వర్ణోత్సవ సంవత్సరం. గత వారంలోనే, జలాంతర్గామి విభాగం రాష్ట్రపతి పతకాన్ని అందుకుంది. అదే విధంగా టైగర్ షార్క్ శక్తి మన భారతీయ నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పవచ్చు. మిత్రులారా, ఐదు వేల సంవత్సరాలకు చెందిన భారతీయ సాగర సంస్కృతి చాలా ప్రాచీనమైంది. గుజరాత్ లోని లోథాల్ ఓడ రేవు ప్రపంచంలోనే చాలా పురాతనమైంది. లోథాల్ ద్వారా 84 దేశాలకు వాణిజ్యం జరిగినట్లు చరిత్రకారులు చెబుతారు. ఈ సముద్ర మార్గాల ద్వారానే ఆసియా మరియు ఆఫ్రికా లోని ఇతర దేశాలతో మన సంబంధాలు పురోగమించాయి. కేవలం వ్యాపార పరంగానే కాక, సాంస్కృతికంగా కూడా ప్రపంచం లోని ఇతర దేశాలతో సంబంధాలు పెంపొందించుకొనేందుకు హిందూ మహా సముద్రం మనకెంతో దోహదపడింది.

హిందూ మహా సముద్రం భారత దేశ చరిత్రను తీర్చిదిద్దింది. ఇప్పుడు ఇది ఆధునిక భారతదేశాన్ని పటిష్ఠపరుస్తోంది. 7500 కిలో మీటర్ల కంటే ఎక్కువగా ఉన్న సముద్ర తీరం, సుమారు 1300 చిన్న చిన్న ద్వీపాలు, దాదాపు 25 లక్షల చదరపు కిలో మీటర్ల మేర ఆర్ధిక మండళ్లు కలిసి సముద్ర శక్తిని దీటుగా తయారు చేశాయి. హిందూ మహా సముద్రం కేవలం భారతదేశానికి మాత్రమే చాలా ముఖ్యమైంది కాదు, యావత్తు ప్రపంచ భవిష్యత్తుకే ముఖ్యమైంది. మొత్తం ప్రపంచం లోని చమురు రవాణాలో మూడింట రెండు వంతులు భారాన్నీ, ప్రపంచం లోని భారీ సరుకు రవాణాలో మూడింట ఒక వంతు, ప్రపంచం లోని మొత్తం కంటైనర్ ట్రాఫిక్ లో సగానికి సగం ఈ సముద్రాలే మోస్తున్నాయి. ఈ ప్రాంతం గుండా వెళ్ళే నాలుగింట మూడింతల ట్రాఫిక్ ప్రపంచం లోని ఇతర ప్రాంతాలకు చేరుతుంది. ఈ సముద్రం నుండి ఎగసిపడే అలలు 40 దేశాలకూ, అలాగే ప్రపంచ జనాభాలోని 40 శాతం ప్రజలకు చేరుతున్నాయి.

|

మిత్రులారా, ఈ 21వ శతాబ్దాన్ని ఆసియా శతాబ్దంగా చెబుతారు. 21వ శతాబ్దపు అభివృద్ధి పథం హిందూ మహా సముద్రం ద్వారానే సాధ్యమని కూడా నిర్ణయించడం జరిగింది. అందువల్ల మన ప్రభుత్వ విధానాల రూపకల్పనలో హిందూ మహా సముద్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ విధానం మన ప్రణాళికల్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది. అందువల్లే దీనిని నేను ‘‘సాగర్’’ SAGAR అనే ప్రత్యేకమైన పేరుతో కూడా వ్యవహరిస్తుంటాను. ‘‘ఎస్ఎజిఎఆర్’’ S. A. G. A. R. అంటే- ‘‘సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజన్’’ అంటే ‘‘ఈ ప్రాంతంలో అందరికీ భద్రత మరియు ప్రగతి’’ అని అర్ధం. హిందూ మహా సముద్రం ప్రాంతం లోని అంతర్జాతీయ ప్రయోజనాల పట్ల, వ్యూహాత్మక ప్రయోజనాల పట్ల, ఆర్ధిక ప్రయోజనాల పట్ల మనకు పూర్తి అవగాహన, జాగ్రత్త ఉన్నాయి. అందువల్ల ఆధునిక, బహుముఖ భారత నౌకాదళం- ఈ మొత్తం ప్రాంతంలో శాంతికి, సుస్థిరతకు కృషి చేస్తోంది. భారత రాజకీయ, ఆర్ధిక, సముద్ర సంబంధ భాగస్వామ్యం వృద్ధి చెందుతున్న విధంగా, ప్రాంతీయ సంబంధాలు పటిష్టమవుతున్న విధంగా, లక్ష్య సాధన కూడా సులభతరమవుతుంది.

మిత్రులారా, సముద్రంలో ఉన్న శక్తులు దేశ నిర్మాణానికి అవసరమైన ఆర్ధిక శక్తిని మనకిస్తాయి. అందువల్ల, భారతదేశంతో పాటు ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు కూడా ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి భారతదేశం తీవ్రంగా ఆలోచిస్తోంది. సముద్ర మార్గం ద్వారా వస్తున్న తీవ్రవాదం కావచ్చు, లేదా పైరసీ సమస్య, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కావచ్చు.. ఈ సవాళ్ళను అన్నింటినీ పరిష్కరించడంలో భారతదేశం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. అందరినీ కలుపుకొని అభివృద్ధి సాధించాలన్నదే మన మంత్రం. అది నీటిలో అయినా, అంతరిక్షంలోనైనా, భూమి మీదైనా.

‘‘వసుధైవ కుటుంబకమ్’’ (ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం) అనే స్పూర్తితో ముందుకు సాగుతున్న భారతదేశం అంతర్జాతీయ బాధ్యతలను నిరంతరం పరిష్కరిస్తూనే ఉంది. తన సహచర దేశాలు సంక్షోభంలో ఉన్నప్పుడు భారతదేశం ముందుగా స్పందిస్తుంది. శ్రీ లంకలో వరదలు వచ్చినప్పుడు, సహాయం అందించడానికి భారతదేశ నౌకాదళం ముందుగా అక్కడకు చేరుకొంది. మాల్దీవులలో నీటి కొరత ఏర్పడినప్పుడు, నీటితో నిండిన ఓడలను భారతదేశం నుండి వెంటనే అక్కడకు పంపడం జరిగింది. బంగ్లాదేశ్ లో తుఫాను భీభత్సం సృష్టించినప్పుడు, సముద్రం మధ్యలో చిక్కుకొన్న బంగ్లాదేశ్ ప్రజలను, భారత నౌకాదళం కాపాడింది. మయన్మార్ లో తుఫాను బాధితులకు మానవతా దృక్ఫథంతో సహాయం చేయడానికి, భారత నౌకాదళం ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. ఇదే కాదు, యెమెన్ సంక్షోభం సమయంలో నాలుగు వేల ఐదు వందలకు పైగా భారతీయులతో పాటు 48 ఇతర దేశాల ప్రజలను కూడా భారతదేశ నౌకాదళం రక్షించింది. భారతదేశ దౌత్యం మరియు భారతీయ భద్రత వ్యవస్థలో మానవతా దృక్ఫథం అనేది భారతదేశం ప్రత్యేకత, అదే మన విస్పష్టమైన విధానం.

నేపాల్ లో భూకంపం సంభవించినప్పుడు, భారతీయ సేన, వాయుసేన లు ఏ విధంగా సహాయ కార్యక్రమాలు నిర్వహించాయో నాకు గుర్తుంది. ఏడు వందలకు పైగా విమానాలు, వెయ్యి టన్నులకు పైగా సహాయ సామగ్రి, వేలాది భూకంప భాదితులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడం, వందలాది విదేశీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఈ విధమైన ‘‘స్నేహపూర్వకత’’ భారతదేశం లో ఇమిడి ఉంది. ఇదే భారతీయ తత్త్వం. భారతదేశం ఎప్పుడూ మానవతా విలువలతో కూడిన పనులు చేస్తూనే ఉంటుంది.

|

మిత్రులారా, శక్తివంతమైన, పటిష్టమైన భారతదేశం కేవలం తన కోసమే కాక యావత్ మనవాళి కోసం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ రోజు మనం ప్రపంచం లోని వివిధ దేశాలతో భుజం భుజం కలిపి పనిచేస్తున్నాం. ఆయా దేశాల సైన్యం తమ తమ అనుభవాలను పంచుకొని, మన సైన్యం తో సమానంగా సమాహారం పెంచుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నాయి. గత ఏడాదిలోనే, 50 దేశాలకు చెందిన నావికాదళాలు అంతర్జాతీయ సైనిక విన్యాసంలో పాల్గొన్నాయి. ఆ సమయంలో విశాఖపట్నంలో ఆవిష్కృతమైన సుందర దృశ్యాన్ని ఎవరూ మరచిపోలేరు.

ఈ ఏడాది కూడా భారతదేశ నౌకాదళం హిందూ మహా సముద్రంలో తన విన్యాసాల ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. జులై నెలలో మలబార్ లో జరిగిన విన్యాసాలలో అమెరికా, జపాన్ ల నావికాదళాలతో కలిసి భారతదేశ నౌకాదళం అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శించింది. అదేవిధంగా ఆస్ట్రేలియా, సింగపూర్, మయన్మార్, జపాన్, ఇండోనేషియా లలో వివిధ నెలల్లో జరిగిన వరుస విన్యాసాలలో కూడా భారతదేశం ఇదే ప్రతిభను కొనసాగించింది. భారతీయ సేన కూడా శ్రీ లంక, రష్యా, అమెరికా, బ్రిటన్, బంగ్లాదేశ్, సింగపూర్ ల వంటి దేశాలతో సంయుక్త విన్యాసాలలో పాలుపంచుకొంది.

సోదరులు మరియు సోదరీమణులారా, ప్రపంచం లోని దేశాలన్నీ ఈ రోజు భారతదేశం అనుసరిస్తున్న శాంతి, సుస్థిరతల యొక్క మార్గంలో పయనించాలని భావిస్తున్నాయన్న వాస్తవాన్ని ఇంతవరకు మనం చెప్పుకొన్న విషయాలు రుజువు చేస్తున్నాయి.

మిత్రులారా, దేశ భద్రత సవాళ్ల స్వభావం మారుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి వీలుగా మన రక్షణ సంసిద్ధతను మెరుగుపరచుకోవడానికి మనం నిరంతరం శ్రమిస్తున్నాం. అందుకు అనుకూలమైన చర్యలు తీసుకుంటున్నాం. సైనిక శక్తితో పాటు, ఆర్ధిక శక్తి, సాంకేతిక శక్తి, అంతర్జాతీయ సంబంధాల శక్తి, ప్రజా విశ్వాసం, దేశ సాత్విక చింతన ల మొదలైన వాటి మధ్య సమన్వయం ఉండాలి. ఇదే ప్రస్తుత సమయంలో మనం కోరుకునేది.

సోదరులు మరియు సోదరీమణులారా, గడచిన మూడు సంవత్సరాలలో రక్షణ, భద్రత లకు సంబంధించిన వ్యవస్థలో మార్పు ప్రారంభమైంది. అనేక నూతన చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక పక్క నిత్యావసర సరకుల అంశాన్ని ప్రాధాన్య ప్రాతిపదికన మేం పరిష్కరిస్తూనే, మరొక పక్క అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోడానికి అనుకూలంగా క్రియాశీల ప్రణాళికను కూడా రూపొందించుకున్నాం. ఎగుమతి ప్రక్రియ లైసెన్స్ ప్రక్రియ వరకు, ఈ విధానంలో పారదర్శకత సమతుల స్పర్థను తీసుకువస్తున్నాం. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంది. ఇప్పుడు 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డిఐ)ను ఆటోమేటిక్ రూట్ లో అనుమతిస్తారు. రక్షణ రంగంలో కొన్ని చోట్ల 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెబడులకు ప్రస్తుతం అవకాశం కల్పించడం జరిగింది. రక్షణ కొనుగోలు విధానంలో కూడా మేము కొన్ని పెద్ద మార్పులు చేశాము; ఈ మార్పులు మేక్ ఇన్ ఇండియా ను కూడా ప్రోత్సహిస్తున్నాయి.

|

ఐఎన్ఎస్ కల్వరీ నిర్మాణానికి సుమారు దాదాపు 12 లక్షల పని దినాలు పట్టినట్లు నాకు చెప్పారు. దీని నిర్మాణ సమయంలో భారతీయ కంపెనీలు, భారతీయ పరిశ్రమలు, చిన్న నవ పారిశ్రామికవేత్తలతో పాటు మన ఇంజినీర్లు సంపాదించిన సాంకేతిక సామర్థ్యం ఒక రకంగా చూస్తే, దేశానికి ‘‘ప్రతిభ నిధి’’ వంటిదని చెప్పవచ్చు. ఈ ప్రతిభ పాటవాలు మనకున్నటువంటి ఆస్తి, ఇది మన దేశానికి భవిష్యత్తులో కూడా మేలు చేస్తూనే ఉంటుంది.

మిత్రులారా, రక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తులను భారతీయ కంపెనీలే తయారు చేసి, వాటిని ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేయడానికి వీలుగా రక్షణ ఎగుమతుల విధానంలో మార్పులు చేశాం. మన సైనిక దళాలు కొనుగోలు చేసుకొనేందుకు వీలుగా, సుమారు 150 నాన్- కోర్ వస్తువుల జాబితాను తయారు చేయడం జరిగింది. సైనిక దళాలు, వారికి అవసరమైన వస్తువుల కొనుగోలుకు ఆర్డ్ నన్స్ ఫ్యాక్టరీల అనుమతిని తీసుకోనక్కరలేదు. వారు అటువంటి సామగ్రిని నేరుగా ప్రైవేటు సంస్థల నుండి కొనుగోలు చేయవచ్చు.

రక్షణ రంగంలో మన దేశం స్వయం సమృద్ధిని సాధించేందుకు వీలుగా, ప్రైవేటు రంగంతో ప్రభుత్వం ఒక వ్యూహాత్మక భాగస్వామ్య విధానాన్ని అమలు చేస్తోంది. భారతీయ కంపెనీలు విదేశాలలో వలెనే యుద్ధ విమానాల నుండీ హెలికాప్టర్ల వరకు, అలాగే యుద్ధ ట్యాంకుల నుండి జలాంతర్గాముల వరకు మన దేశంలోనే తయారు చేయాలన్నది మా ప్రయత్నం. ఈ వ్యూహాత్మక భాగస్వాములు భవిష్యత్తులో భారతీయ రక్షణ పరిశ్రమను మరింత పటిష్ట పరచనున్నారు.

రక్షణ సంబంధమైన వస్తువుల కొనుగోలును వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అనేక విధాన నిర్ణయాలను కూడా తీసుకొంది. రక్షణ మంత్రిత్వ శాఖ మరియు సర్వీసెస్ ప్రధాన కార్యాలయాల స్థాయిలో ఆర్ధిక అధికారాల స్థాయిని కూడా పెంచడం జరిగింది. ఈ మొత్తం ప్రక్రియను మరింత సులభతరంగా , సమర్ధవంతంగా చేయడం జరిగింది. ఈ ప్రధానమైన సంస్కరణల ద్వారా రక్షణ వ్యవస్థ శక్తి, దేశ సైనిక దళాల సామర్ధ్యం మరింతగా పెరుగుతాయి.

సోదరులు మరియు సోదరీమణులారా, మన ప్రభుత్వ భద్రత విధానం, దేశం వెలుపల ప్రభావం చూపడమే కాదు, ఇది దేశ అంతర్గత భద్రత పైన కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. తీవ్రవాదం అనేది భారతదేశానికి వ్యతిరేకంగా ఏ విధంగా అంతర్గత యుద్ధంగా ప్రయోగించబడుతోందో మీకందరికీ తెలుసు. మన ప్రభుత్వం తీసుకున్న విధానాల ఫలితంగా, మన సైనికుల ధైర్యసాహసాల ఫలితంగా జమ్ము & కశ్మీర్ లో అటువంటి తీవ్రవాదుల చర్యలు కొనసాగకుండా అరికట్టగలిగాం. జమ్ము & కశ్మీర్ లో ఈ ఏడాది ఇంతవరకు రెండు వందల మందికి పైగా తీవ్రవాదులను హతమార్చడం జరిగింది. రాళ్లు విసిరే సంఘటనలు కూడా గణనీయంగా తగ్గాయి.

ఈశాన్య రాష్ట్రాల పరిస్థితిలో కూడా గణనీయమైన పురోగతి సాధించాము. నక్సల్- మావోయిస్టు హింస కూడా తగ్గిపోయింది. దీని ద్వారా ఈ ప్రాంతాల్లోని చాలా మంది ప్రజలు ఇప్పుడు అభివృద్ధి పథం వైపు మొగ్గు చూపుతున్నారన్న విషయం తేటతెల్లమవుతోంది. దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకొంటున్నాను. రాష్ట్ర పోలీసు దళాలు, అనుబంధ సైనిక దళాలు, మన సైన్యం, అదే విధంగా భద్రతలో భాగస్వాములైన అన్ని సంస్థల్లో అజ్ఞాతంగా పని చేస్తున్న వారందరికీ ఈ దేశంలో నివసిస్తున్న 1.25 బిలియన్ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. వారిని నేను అభినందిస్తూ, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా, భద్రత దళాల శక్తి మీదే దేశం యొక్క శక్తి ఆధారపడి ఉంటుంది. అందువల్ల భద్రత దళాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి జాప్యం చేయకుండా వారి కోసం నిర్ణయాలు తీసుకోవాలి. వారికి బాసటగా నిలవడమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యం. అదే ఈ ప్రభుత్వం యొక్క స్వభావం. దీనికే మేం కట్టుబడి ఉన్నాం. అందువల్లనే అనేక దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ‘‘ఒకే ర్యాంకు ఒకే పింఛను’’ సమస్యను ఇప్పుడు పరిష్కరించాం. ఇంతవరకు సుమారు 11 వేల కోట్ల రూపాయల మేర బకాయిలను 20 లక్షల మందికి పైగా విశ్రాంత సైనిక సిబ్బందికి చెల్లించడం జరిగింది.

|

సోదరులు మరియు సోదరీమణులారా, సముద్ర విప్లవ మిషన్ లో ధైర్య సాహసాలతో పనిచేసిన ఆరుగురు నౌకాదళ అధికారులను నేను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకొంటున్నాను. వారిని నేను సత్కరించదలిచాను. రక్షణ మంత్రి శ్రీమతి నిర్మల గారి ప్రేరణతోను, భారతీయ మహిళా శక్తి అందించిన సందేశంతోను, ఈ ఆరుగురు ఎంతో ధైర్యంతో ముందడుగు వేస్తున్నారు.

మిత్రులారా, భూమి మీద, సముద్రంలోను, ఆకాశంలోను అధిగమించలేనంతటి భారతీయ సామర్ధ్యాలను నిర్వహిస్తోంది కేవలం మీరే. ఐఎన్ఎస్ కల్వరీ తో ఈ రోజు ఒక నూతన అధ్యాయం మొదలైంది.

సాగర భగవానుడు మిమ్ములను దృఢంగా, క్షేమంగా ఉంచుగాక. ‘‘శమః నౌ వరుణః’’ అనేదే మీ లక్ష్యం. ఈ ఆకాంక్షతో మీకు మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్వర్ణోత్సవ సంవత్సరంలో ఈ సరికొత్త సభ్యురాలి ఆగమనం పట్ల మిమ్మల్నందరినీ అభినందిస్తూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను.

అనేకానేక ధన్యవాదాలు.

భారత్ మాతా కీ జయ్.

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
I-T refunds up 6x in 11 years at ₹4.8L crore

Media Coverage

I-T refunds up 6x in 11 years at ₹4.8L crore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 జూలై 2025
July 13, 2025

From Spiritual Revival to Tech Independence India’s Transformation Under PM Modi