ఇథనాల్ సరఫరా సంవత్సరం (ఈఎస్వై) 2024-25కుగాను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ)కు ఇథనాల్ కొనుగోలు ధరను సవరించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఇథనాల్ సరఫరా నవంబరు 1, 2024న ప్రారంభమై, అక్టోబరు 31, 2025తో ముగియనుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇథనాల్ మిశ్రిత పెట్రోల్ (ఈబీపీ) విధానంలో భాగంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇథనాల్ ను కొనుగోలు చేయాలి. దీనికి అనుగుణంగా, సీ హెవీ మొలాసెస్ (సీహెచ్ఎం) నుంచి తయారు చేసిన ఇథనాల్కు ఈబీపీ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని నియంత్రించిన మిల్లు ధర 2024-25 ఏడాదికి (2024 నవంబరు 1 నుంచి 2025 అక్టోబరు 31 మధ్య కాలానికి) లీటరు ఒక్కింటికి రూ.56.58 నుంచి రూ.57.97గా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఆమోదం ఇథనాల్ ధరలను స్థిరంగా ఉంచడంతోపాటు, ఇథనాల్ సరఫరాదారులకు గిట్టుబాటు ధరలను అందించాలన్న ప్రభుత్వ విధానాన్ని కొనసాగించడానికి తోడు, ముడి చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికీ, విదేశీమారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికీ, పర్యావరణానికి మేలు చేయడానికీ సాయపడనుంది. చెరకు రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి - గతంలో మాదిరిగానే – జీఎస్టీని (వస్తు, సేవల పన్ను), రవాణా ఖర్చులను విడిగా చెల్లిస్తారు. సీహెచ్ఎం ఇథనాల్ ధరలను 3 శాతం మేరకు పెంచడం వల్ల తాజాగా పెంచిన మిశ్రమం లక్ష్యాన్ని చేరుకోవడానికి తగినంత ఇథనాల్ అందుబాటులోకి వస్తుందన్న భరోసా ఏర్పడింది.
ప్రభుత్వం ఇథనాల్ మిశ్రిత పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమాన్ని అమలు చేస్తున్న కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు 20 శాతం వరకు ఇథనాల్ను కలిపిన పెట్రోలును విక్రయిస్తున్నాయి. సంప్రదాయక ఇంధనాల స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధనాలను, పర్యావరణ మిత్రపూర్వక ఇంధనాలను వినియోగించడాన్ని ప్రోత్సహించడం కోసం దేశం అంతటా ఈబీపీని అమల్లోకి తెచ్చారు. ఈ చొరవ ఇంధన అవసరాలను తీర్చడంలో దిగుమతులపైన ఆధారపడడాన్ని తగ్గించదలుస్తోంది. అలాగే, వ్యవసాయ రంగానికి మద్దతివ్వాలన్న ఆలోచన కూడా దీనికి తోడైంది. గత పది సంవత్సరాల్లో (కిందటేడాది డిసెంబరు 31నాటికి), ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోలులో ఇథనాల్ను కలిపే ప్రక్రియను అనుసరించినందున సుమారుగా రూ.1,13,007 కోట్ల కన్నా ఎక్కువ విదేశీమారక ద్రవ్యం ఆదా కావడంతోపాటు దాదాపు 193 లక్షల మెట్రిక్ టన్నుల మేర ముడి చమురుకు ప్రత్యామ్నాయం లభించినట్లయింది.
ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇథనాల్ను కలుపుతున్న తీరు ఇథనాల్ సరఫరా సంవత్సరం (ఈఎస్వై) 2013-14లో 38 కోట్ల లీటర్ల స్థాయి నుంచి 707 కోట్ల లీటర్ల స్థాయికి పెరిగింది. (ఈఎస్వైని ప్రస్తుతం ఒక ఏడాదిలో నవంబరు 1వ తేదీ మొదలు తరువాతి ఏడాది అక్టోబరు 31వ తేదీ వరకు లెక్కిస్తున్నారు). ఈఎస్వై 2023-24 లో సగటు మిశ్రమం 14.60 శాతం స్థాయికి చేరింది.
పెట్రోలులో 20 శాతం ఇథెనాల్ను కలపాలన్న లక్ష్యానికి ఇది వరకు ఈఎస్వై 2030ని గడువుగా పెట్టుకోగా ప్రభుత్వం దీనిని ముందుకు జరిపి, ఈఎస్వై 2025-26గా నిర్దేశించింది. అంతేకాక, ‘‘భారత్లో 2020-25 మధ్య ఇథనాల్ మిశ్రమానికి మార్గసూచీ’’ని ప్రజలకు కూడా అందుబాటులో ఉంచారు. ఈ మార్గంలో ఒక ముందడుగా అన్నట్లుగా, చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు కొనసాగుతున్న ఈఎస్వై 2024-25లో 18 శాతం మిశ్రమ స్థాయిని అందుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
ఇటీవల సాధ్యపడ్డ మరిన్ని సానుకూల చర్యలలో.. ఇథనాల్ తయారీ సామర్థ్యం ఏడాదికి 1713 కోట్ల లీటర్లకు పుంజుకుంది. ఇథనాల్ కొరతతో సతమతమవుతున్న రాష్ట్రాలలో అచ్చంగా ఇథనాల్ ఉత్పత్తికే ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి (డెడికేటెడ్ ఇథనాల్ ప్లాంట్స్.. ‘డీపీపీ) దీర్ఘకాలిక ఆఫ్-టేక్ అగ్రిమెంట్లు (ఎల్టీఓఏస్); సింగిల్ ఫీడ్ డిస్టిలరీలను మల్టిఫీడ్ డిస్టిలరీలుగా చేసేందుకు అవసరమైన మార్పుచేర్పులను చేపట్టడాన్ని ప్రోత్సహించడం; ఈ-100, ఈ-20 ఇంధన లభ్యత; వివిధ రకాలైన ఇంధనాలతో నడిచే వాహనాల (ఫ్లెక్సి ఫ్యూయల్ వెహికల్స్)ను ప్రవేశపెట్టడం.. వంటివి చెప్పుకోదగ్గవి. ఈ చర్యలన్నీ ‘వ్యాపార నిర్వహణలో సౌలభ్యానికి’ జతపడి, ఆత్మనిర్భర్ (స్వయం సమృద్ధ) భారత్ లక్ష్య సాధనకు కూడా కలిసిరానున్నాయి.
ప్రభుత్వం ఈబీపీ ప్రోగ్రామును చురుకుగా అమలుచేస్తున్న నేపథ్యంలో, దేశం అంతటా గ్రీన్ఫీల్డ్ డిస్టిలరీలు, బ్రౌన్ఫీల్డ్ డిస్టిలరీలను విస్తరించడం, నిల్వ, రవాణా సదుపాయాల రూపాల్లో అదనపు పెట్టుబడులు పోగుపడడం ఒక్కటే కాకుండా మరిన్ని ఉద్యోగావకాశాలు, వివిధ ఆసక్తిదారు సంస్థల (స్టేక్హోల్డర్స్) మధ్య విలువ పంపకం కూడా సాధ్యపడింది. డిస్టిలరీలు అన్నీ ఈ పథకం ప్రయోజనాలను అందుకోగలుగుతాయి. వాటిలో చాలా వరకు డిస్టిలరీలు ఈబీపీ ప్రోగ్రామ్ కోసం ఇథనాల్ను సరఫరా చేస్తాయని భావిస్తున్నారు. ఇది విదేశీమారక ద్రవ్యాన్ని గణనీయ స్థాయిలో ఆదా చేసుకోవడానికీ, ముడి చమురుకు ప్రత్యామ్నాయాన్ని కలిగి ఉండడానికీ, పర్యావరణ ప్రయోజనాలను పొందడానికీ, అలాగే చెరకు రైతులకు త్వరితగతిన చెల్లింపులు చేయడానికీ దోహదం చేయనుంది.